Aikyam – Hindustani Jugalbandi – Review-January 2025

12 జనవరి 2025 పూణే సంగీత సభ వారిచే భారతీయ శాస్త్రీయ సంగీతం – ఐక్యం నిర్వహించబడినది. ఇందులో శ్రీయుతులు సమీప్ కులకర్ణి మరియు లలిత్ సుబ్రహ్మణ్యన్ తమ వాద్య గాత్ర జుగల్బందీ కార్యక్రమాన్ని రక్తి కట్టించారు.

ప్రథమంగా శ్రీ సమీప్ కులకర్ణి సితార్ పై యమన్ రాగాలాప్ తో ప్రారంభించి రూపక్ తాల్ మధ్య లయ లో హాఫ్ బీట్ మీద ముఖ్డా తీసుకుని లయకారి తో తన అసాధారణ ప్రదర్శనను కొనసాగించారు. పిదప తీన్ తాల్ నందు ధృత్ లయ లో ఒక సాంప్రదాయ రచనను ఆపై అతిధృత్ లయ లో ఝాలా ను వాయించి, చివరిగా చక్రధార్ తిహాయి తో తన సోలో ప్రదర్శనను ముగించారు. శ్రీ సమీప్ దంతకారి శైలిని గాయకి అంగ్ శైలి తో మేళవించి సుర్ తాల్ పై తన కున్న పట్టు తో శ్రోతలను మంత్రముగ్ధులను గావించారు.

శ్రీ లలిత్ సుబ్రహ్మణ్యన్ సారంగ రాగ వర్ణం తో ప్రారంభించి అందులో తన మనోధర్మాన్ని చూపుతూ స్వరకల్పన గావించారు. ఆ పై ఖరహరప్రియ రాగం యొక్క విస్తారమైన ఆలాపన “ ప్రక్కల నిలబడి ” అను త్యాగరాజ కృతి కి చక్కని సశాస్త్రీయ పద్ధతిలో నెరవు, స్వరకల్పన కచేరీకి మరింత రంజకత్వాన్ని అద్దాయి. ఆపై తన తండ్రి గారైన శ్రీ సుందరం సుబ్రహ్మణ్యన్ మురుగన్ పై రచించిన విరుత్తమును శహన, హంసానంది, బృందావన సారంగ రాగ మాలిక గా ఆలపించి శ్రీ పెరియసామి తూరున్ రచన “ కలియుగ వరదన్ ” తో తన సోలో ప్రదర్శనను అత్యద్భుతంగా ప్రదర్శించి ముగించారు.

ద్వితీయార్థం లో కళాకారులిరువురు కర్ణాటక బాణీలో దీక్షితార్ కృతి ఐన “ వాతాపి గణపతిం భజే ”, హిందూస్థానీ బాణీలో తత్సమానమైన “ లాగే లగన్ ” అనే సంప్రదాయ బందిష్ లను హంసధ్వని రాగంలో తీసుకోని ఆలాపన, తానం, నెరవు, స్వరకల్పనలతో తమ అసమాన ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తూ శ్రోతలను సంగీత లోకంలో విహరింపచేసారు.

వీరికి వయోలిన్ పై ముంబై బాలకృష్ణన్, మృదంగం పై ముంబై శంకర్ నారాయణ్, తబలా పై వేదాంగ్ జోషి చక్కటి సహ కారాన్ని అందిస్తూ తన్యావర్తన తో తమ విశ్వరూపాన్ని ప్రదర్శించి శ్రోతలను ఉర్రూతలూగించారు.